దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం 'గజ్వా-ఏ-హింద్' (భారత్‌పై యుద్ధం) ప్రారంభించామని విజయవాడ ఉగ్రలింకుల కేసులో అరెస్టయిన నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఈ మార్గాన్ని తమకు ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన అల్ హకీం షుకూర్ చూపించాడని వారు పోలీసు కస్టడీలో సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం.

పోలీసుల విచారణలో నిందితులు మరిన్ని కీలక వివరాలు వెల్లడించారు. "భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయాలని, 'ఏ నేషన్ లెడ్ బై మహమ్మద్ విల్ నాట్ సరెండర్' వంటి నినాదాలతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నింపేందుకు ప్రయత్నించాం. ఇస్లాంను విశ్వసించని వారిపై సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశాం. జిహాద్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిని షుకూర్ మాకు అప్పగించాడు. దేశంలోని స్లీపర్‌ సెల్స్‌తో త్వరలో పరిచయం చేస్తానని చెప్పాడు. కానీ, అంతలోనే మేం అరెస్టయ్యాం. ఇప్పటివరకు మేం అతన్ని చూడలేదు, ఎక్కడుంటాడో కూడా మాకు తెలియదు" అని నిందితులు చెప్పినట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్
సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, పాకిస్థాన్, ఆఫ్ఘ‌నిస్థాన్‌లకు పంపి మిలిటెంట్ శిక్షణ ఇప్పించాలని అల్ హకీం షుకూర్ కుట్ర పన్నాడు. ఇందుకోసం 'బెన్ ఎక్స్ డాట్ కామ్' పేరుతో సోషల్ గ్రూపును ఏర్పాటు చేసి, దేశంలోని పలు రాష్ట్రాల యువతకు గాలం వేశాడు. ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గత నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్‌లను అరెస్టు చేయడంతో ఈ నెట్‌వర్క్ గుట్టురట్టయింది.

వీరిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం, బళ్లారికి చెందిన అబ్దుల్ సలామ్, పాట్నాకు చెందిన షాద్మాన్ దిల్‌ఖ్‌ష సహా ఏడు రాష్ట్రాల్లో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఏపీ సీఐడీ అధికారులు షాద్మాన్ దిల్‌ఖ్‌షతో పాటు మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో సోమవారం వారిని కోర్టులో హాజరుపరిచి, రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ విచారణలో మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ లింకులు ఉన్నట్లు, కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలను అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి 25 నుంచి 40 వరకు వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు కనుగొన్నారు.

రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ
ఈ కేసు తీవ్రత దృష్ట్యా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏపీ పోలీసులకు సహకారం అందిస్తున్న ఎన్‌ఐఏ, త్వరలోనే ఈ కేసును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.

AP Radicalisation Case
Vijayawada Terror Case
Islamic State Conspiracy India
Ghazwa-e-Hind
Al-Qaeda
ISIS
AP Intelligence
NIA Investigation
Radicalization
Al Hakeem Shukoor
sleeper cells

More Telugu News